অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మహిళా అక్షరాస్యత - గ్రామీణ ఆర్ధికాభివృద్ధి

మహిళా అక్షరాస్యత - గ్రామీణ ఆర్ధికాభివృద్ధి

అక్షరాస్యత ప్రాముఖ్యత

వ్యక్తి జీవితంలోను, మొత్తం సమాజంలోను, విద్య విలువైన సాధనం.

అడుగడుగునా ఒక వ్యక్తి తన ప్రయోజనాలను కాపాడుకునేందుకు అక్షరాస్యత ఆయుధమవుతున్నది.

విద్య భావ ప్రకటనా సామర్థ్యాన్నిస్తుంది.  స్వరాజ్య పోరాటంలో ఒక భాగంగా స్త్రీ చైతన్యం ప్రారంభమైంది.  అందులో ప్రధానమైన అంశం స్త్రీ విద్య.  స్త్రీకి విజ్ఞాన సముపార్జనతో పాటుగా ఆర్థిక స్వాతంత్య్రం కూడా కావాలి అని గుర్తించారు.  అందుకు విద్య అవసరం అని స్త్రీ విద్యను ప్రోత్సహించడానికి అనేక సదుపాయాలు ప్రభుత్వం సమకూరుస్తోంది.

సామాజిక ఎదుగుదల

వ్యక్తిగతమైన స్వేచ్ఛ, సంక్షేమంతో పాటు సామాజిక లాభాలను పొందటానికి మెరుగైన ఆరోగ్యంతో పాటు, లోక జ్ఞానాన్ని విద్య అందిస్తుంది.  స్త్రీకి సహజంగా ఆలోచించే శక్తి కలుగుతుంది.  కావున సమాజంలో అభివృద్ధి సాధించాలంటే స్త్రీకి విద్య తప్పకుండా అందించాలి.  అప్పుడే సమాజంలో ఎదుగుదల అనేది ఏర్పడుతుంది.

జ్ఞానం పెరుగుదల

స్త్రీలు చదువుకోవడం వలన తమ కుటుంబాల్ని, పిల్లల్ని కూడా కాపాడుకోగలరు. చదువుకున్న స్త్రీలు పిల్లలకు పౌష్టికాహారం, టీకాలు వేయించటం, అంటురోగాల నిర్మలన, జనాభా నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ,అంటరాని తనం, మూఢనమ్మకాలను జయించటం మొదలైన వాటిని సాధించగలరు.

రాజకీయ అవగాహన

మనదేశంలో స్త్రీ రాజకీయ, సాంఘిక రంగాల్లో ఎంతో వెనకబడి ఉంది.  కేవలం వేళ్ళమీద లెక్కపెట్టే సంఖ్యలో మాత్రమే  రాజకీయరంగంలో కనబడుతోంది.  అది స్త్రీ అభివృద్ధికి నిదర్శనం కాదు.  విద్యవలనే రాజకీయ భాగస్వామ్యం సాధ్యమవుతుంది.

ఆర్థిక స్తోమత/నైపుణ్యాలను పెంచడం

చదువుకోవడం వల్ల నేడు స్త్రీ కుటుంబాన్ని, ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా తనంతటతానే నిలబడే శక్తిని సంపాదిస్తుంది.  జీవితంలో ఏ ఆపదలు వచ్చినా కష్టాల పాలు కాకుండా ధైర్యంగా నిలబెట్ట కలుగుతుంది.  కావున స్త్రీ విద్య, స్త్రీ సంపద అనేది  పిల్లల భవిష్యత్తుకి, కుటుంబ భవిష్యత్తుకు, సమాజ శ్రేయస్సుకు, దేశ ప్రగతి పునాదికి ఎంతో అవసరం.

మహిళా అక్షరాస్యత యొక్క లక్ష్యాలు

విద్య యొక్క సాంప్రదాయక లక్ష్యాలైన ‘మనిషిని’ తయారుచేయడం, జ్ఞానం, జ్ఞాన సముపార్జన వంటి సూక్తులు మారి, కొత్త ఆలోచనలకు తావు ఇస్తుంది.  ఇది నేటి విద్యావిధానం.  చదువుకున్న ప్రతి వ్యక్తికి స్వతంగా ఆలోచించే శక్తి అనేది వస్తుంది.

మహిళలకు అక్షరాస్యతను నేర్పించడం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే ”ఒక అబ్బాయికి విద్య నేర్పితే ఒక వ్యక్తికి విద్య నేర్పడం అయితే, ఒక అమ్మాయికి విద్య నేర్పితే మొత్తం కుటుంబానికి విద్య నేర్పడం” అంటారు నెహ్రూ.

అందుకే మహిళలు అక్షరాస్యులు అయితే దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది.  అందుకే స్త్రీకి విద్య ముఖ్య లక్ష్యం.

అక్షరాస్యత ప్రాముఖ్యతను వివరించుట

ఈ కంప్యూటర్‌ కాలంలో ప్రతి వ్యక్తికీ తప్పకుండా విద్య అవసరం.  ముఖ్యంగా గ్రామీణ స్త్రీలలో అక్షరాస్యతకు, స్త్రీ విద్యావ్యాప్తికి ఎనలేని ప్రాధాన్యం కలదు.  స్త్రీ విద్యావంతురాలయిన కుటుంబమంతా విద్యావంతమవుతుంది.

గ్రామీణ ఆర్థికాభివృద్ధిలో అక్షరాస్యత పాత్రను పరిశీలించుట

గ్రామీణ ఆర్థికాభివృద్ధిలో విద్య యొక్క పాత్ర ఎంతో వుంది.  విద్య గ్రామీణ పరిశుభ్రతను పెంచి, గ్రామీణ ఆరోగ్యాన్ని, గ్రామీణుల సామర్థ్యాన్ని పెంచుతుంది.

అక్షరాస్యత సాధనలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు

అక్షరాస్యత అనేది మహిళలందరికీ అందుబాటులో లేదు.  చాలా మంది మహిళలకు బాల్యవివాహాలు చేయడం,  ఆర్థికంగా వెనుకబడి వుండటం వలన వారు విద్యకు దూరం అవుతున్నారు.

అక్షరాస్యతపై ప్రభుత్వ విద్య విధానం

స్త్రీలలో అక్షరాస్యతను పెంచడం కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది.  డిపెప్‌, సామాజిక విద్య, మౌలిక విద్య, అక్షరభారతి, రాత్రిపూట చదువు, ఎయఫ్‌ఎల్‌పి, ఉచిత నిర్బంధ విద్య, వయోజన విద్య, సర్వశిక్ష అభియన్‌, బడిబాట.

గ్రామీణ ఆర్థికాభివృద్ధిలో అక్షరాస్యత పాత్ర

గ్రామీణ ఆర్థికాభివృద్ధిలో విద్య యొక్క పాత్ర ఎంతో వుంది.  మన దేశంలో నిరక్షరాస్యత శాతం హెచ్చు.  అందులోను గ్రామాలలో మరీ ఎక్కువ.  ఈ కారణంగా గ్రామీణ విద్య అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నది.  విద్యావ్యాప్తికి ముఖ్యంగా గ్రామీణ స్త్రీలో అక్షరాస్యతకు, స్త్రీ విద్యావ్యాప్తికి ఎనలేని ప్రాధాన్యం కలదు.  గ్రామీణ ప్రాంతాలలో అక్షరాస్యతను పెంచుటలో గ్రామీణ విద్య మరియు వయోజన విద్య ప్రవేశపెట్టింది.  వయోజనులకు విద్య విలువ తెలియదు.  తమ పిల్లలను కూడా నిరక్షరాస్యులుగా ఉంచుతారు.  అదే అక్షరాస్యులయిన తల్లిదండ్రులు, తమ పిల్లలకు కూడా విద్య కావాలని కోరుకుంటారు.  నిజానికి పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేసేది తల్లి.  ఆ తల్లి నిరక్షరాస్యురాలు, విద్యాగంధం లేనిదైన ఆ పిల్లలు ఎలా ఉంటారనే విషయాన్ని మనం ఊహించుకొనవచ్చు.  నేటికీి మనదేశంలో మనం తీర్చిదిద్దలేకపోవడానికి కారణం గ్రామీణ నిరక్షరాస్యత మరియు విద్యాలోపం.  గ్రామీణ పాఠశాలలను వయోజన విద్యాకేంద్రాలుగా ఉపయోగిస్తారు.  స్వచ్ఛంద సేవాసంస్థలు కూడా వయోజన విద్యావ్యాప్తికి కృషి చేస్తాయి.

సాంప్రదాయిక ఆర్థిక వ్యవస్థ స్వయం సమృద్ధి గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉంది.  ఆధునిక గ్రామీణ వ్యవస్థలో విద్య యొక్క ఆవశ్యకత, రాజకీయ పాలనా సంబంధమైన స్వయం పరిపాలనా విధానమున్నది.  పాఠశాలలు, కళాశాలలు ఎక్కువగా గ్రామ ప్రాంతాలలో ఏర్పాటు చేయడం ద్వారా గ్రామ జీవితంలో, గ్రామ సమాజ నిర్మితిలో అతి త్వరగా మార్పులు తీసుకొని రావడం జరుగుతుంది.  విద్యావ్యాప్తి చెందిన సమాజాలలో మూఢ నమ్మకాలకు, సనాతన కట్టుబాట్లకు వ్యతిరేకంగా ఆచరణలో ఆలోచనలు మొదలవుతాయి.  సాంప్రదాయికత క్రమంగా క్షీణించి క్రొత్తరకమైన వృత్తులకు ప్రాధాన్యము ఏర్పడుతుంది.  మహిళలకు విద్య అవసరం అని స్త్రీ విద్యను ప్రోత్సహించడానికి అనేక సదుపాయలు ప్రభుత్వం సమకూరుస్తోంది.

గ్రామీణ విద్యావ్యాప్తి వలన కలుగు ఈ క్రింది ప్రయెజనాలు గ్రామీణ విద్య ప్రాముఖ్యతను మరింతగా వెల్లడిస్తాయి.

  • విద్య నిరక్షరాస్యులలో చలన మార్పులను తీసుకువచ్చి గ్రామీణ రైతులలోని జడత్వాన్ని పోగొడుతుంది.
  • విద్య గ్రామీణ పరిశుభ్రతను పెంచి, గ్రామీణ ఆరోగ్యాన్ని, గ్రామీణుల సామర్థ్యాన్ని పెంచుతుంది.
  • గ్రామీణ ప్రజలను మరింత విద్యావంతులుగా మాత్రమే కాక, ఆరోగ్యవంతులుగా కూడా చేస్తుంది.  వారి జీవన ప్రమాణాలను పెంచుతుంది. నిజానికి మనదేశంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాలలో విజయవంతం కాకపోవడానికి కారణం గ్రామీణుల నిరక్షరాస్యత గ్రామీణులు విద్యావంతులయిన రోజున ఇవన్నీ విజయవంత మవుతాయి.

ప్రభుత్వ విద్యావిధానం

ప్రభుత్వం స్త్రీ విద్యకోసం ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా ఇంకా ప్రభుత్వం అనుకున్న పూర్తి లక్ష్యాన్ని సాధించలేకపోతోంది.  మన దేశంలో 14 సం|| వయస్సు పూర్తి చేసేవరకు స్త్రీ, పురుషులిద్దరికీ మన ప్రభుత్వం నిర్బంధ ఉచిత విద్యను అందరికీ అందుబాటులోకి తేవడానికి  బాగా కృషిచేస్తున్నది.

ప్రభుత్వం స్త్రీలలో అక్షరాస్యతా శాతం పెంచడం కోసం కొన్ని పథకాలు, కార్యక్రమాలు నిర్వహించి కొన్ని జిల్లాలను సంపూర్ణ అక్షరాస్యత జిల్లాలుగా ప్రకటించి అక్షర మహిళ, అక్షర సంక్రాంతి, చదువుల పండుగ, బడిబాట లాంటి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించుచున్నారు.  అంతేకాక 2010 సం||కి భారతదేశంలో ప్రతి శిశువును ఎనిమిదవ తరగతి వరకు విద్యావంతుల్ని చేయాలనే సంకల్పంతో డిపెప్‌, శిక్షాకర్మి ప్రాజెక్టు, లోక్‌ ఋంబిష్‌ ప్రాజెక్టుల అనుభవాల ఆధారంగా సర్వశిక్ష అభియన్‌ అనే నతన ప్రాజెక్టుకు 2000 సం||లో శ్రీకారం చుట్టడం జరిగింది.

సంపూర్ణ అక్షరాస్యతకు ”అక్షర భారతి”

స్త్రీలలో అక్షరాస్యతను అభివృద్ధి చేయడంలో భాగంగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేబడుతోంది.  అందులో భాగమే ఈ అక్షరభారతి.  సంపూర్ణ అక్షరాస్యతను సాధించుటయే అక్షర భారతి ముఖ్య ఉద్దేశ్యం.

అక్షరాస్యత కోసం చేపట్టిన కార్యక్రమాలు :-

  • మహిళా అక్షరాస్యత : 1901 నుండి ప్రారంభం
  • సామాజిక విద్య : 1951-56
  • సంపూర్ణ అక్షరాస్యత : 1976
  • జాతీయ అక్షరాస్యత : 1978-83
  • నూతన జాతీయ విద్యావిధానం : 1986
  • సంపూర్ణ అక్షరాస్యత : 1990

విద్య సమస్యలు – పరిష్కార వర్గాలు

సమస్యలు :-

దేశానికి స్వాతంత్య్రము వచ్చి ఆరు దశాబ్దాలు గడిచినా, ప్రజల విద్యావసరాలు తీర్చడానికి ప్రభుత్వము ఎంతో కృషి చేస్తున్నప్పటికీ ఇంకన పాఠశాలలో చేరవలసిన వారు చాలా మంది ఉన్నారు. మన దేశంలో గ్రామీణ ప్రజలు ముఖ్యంగా విద్యావిషయకంగా శ్రద్ధ చపకపోవడానికి క్రింది కారణాలు దోహదమౌతాయి.

  • గ్రామాలలో ప్రధానవృత్తి అయిన వ్యవసాయనికి చదువుతో సంబంధము లేదని ప్రజలు భావిస్తున్నారు.  అందుచేత చాలా మంది తల్లిదండ్రులు బాల్యదశ నుండే పిల్లలను కేవలం వ్యవసాయ పనులకే మళ్ళిస్తున్నారు.
  • గ్రామీణ ప్రాంతాలలో పాఠశాల సంఖ్య తక్కువగా ఉండడం, సౌకర్యాలు సక్రమంగా లేకపోవడం, ఓపిక నైపుణ్యము కలిగి గ్రామీణ ప్రజలను చైతన్యవంతం చేయగల ఉపాధ్యాయులు తక్కువగా ఉండడం కూడా వివిధ కారణాలే.
  • ప్రభుత్వ పాఠశాలలో జరిపే విద్యాబోధన నిరుత్సాహంగాను అసంతృప్తిగాను ఉండడము, ప్రాథమిక విద్య ప్రణాళిక కూడా విద్యార్థుల జీవన విధానానికి అనుకూలంగా లేకపోవడము ఇతర కారణాలుగా చెప్పవచ్చును.
  • చివరగా అన్నింటికన్నా ముఖ్యమైన కారణము ప్రజల పేదరికమే. చదువు అనేది ఖర్చుతో కూడిన పని అనే అపోహ ప్రజలలో ఉండడం చేత గ్రామాలలో చాలామంది పేద ప్రజలు తమ పిల్లలను చదివించడానికి సుముఖతను చూపడం లేదు.
  • స్త్రీలపై జరిగే అత్యాచారాల వలన స్త్రీలు చదువుకోడానికి ముందుకు రావడం లేదు.  ముఖ్యంగా రోజురోజుకు స్త్రీలకు రక్షణ లేకుండా పోతున్నది.

పరిష్కార మార్గాలు :-

దేశప్రజల నిరక్షరాస్యత దేశాభివృద్ధికి గొడ్డలిపెట్టు.  విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన భారత రాజ్యాంగ నిర్మాతలు విద్య సార్వత్రీకరణను రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాలలో పొందుపరిచినారు.  భారత ప్రభుత్వము ప్రజలను చైతన్యవంతులను చేయడానికి, ”నిరక్షరాస్యతా నిర్మలనా యజ్ఞాన్ని” ప్రారంభించింది.

  • విద్యను అందరికీ అందుబాటులో ఉంచడానికి ఈ క్రింది విషయాలు ప్రధానంగా పేర్కొనబడినాయి. ప్రతి విద్యార్థికి అందుబాటులో ఉంచడానికి 1 నుండి 3 కి.మీ. దూరంలో ఒక ప్రాథమికోన్నత పాఠశాలను ఏర్పాటు చేయడం.
  • ఆపరేషన్‌ బ్లాక్‌ బోర్డు అనే పథకము ద్వారా పాఠశాల లన్నింటిలోను కనీస సదుపాయలు కల్పింపబడేటట్లు చడడము.
  • గ్రామీణ పేద విద్యార్థులకు రెసిడెన్షియల్‌ ప్రాధమిక పాఠశాలలు ఏర్పాటు చేసి, స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సహాయాన్ని చేసే పథకాన్ని ప్రభుత్వం చేబడుతుంది.
  • ఆరోగ్య సంరక్షణ, మధ్యాహ్న భోజన పథకం, ఉచిత యూనిఫామ్‌లు, ఉచితంగా వ్రాత సాధనాలు, స్కూల్‌ బ్యాగులు, స్కాలర్‌షిప్‌ వంటివి ఇవ్వడం మరియు మహిళల్లో ఉన్నత విద్యను పెంపొందించటానికి మహిళాయూనివర్సిటీలకు ప్రోత్సాహమివ్వాలి.
  • కొండ ప్రాంతాలలోని, వెనుకబడిన బాలికలకు ఉచిత రవాణా, గృహవసతి, సౌకర్యాలు, హాస్టలు వసతులు కల్పించాలి.

ముగింపు :-

గ్రామీణ ప్రజల విద్యావసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వము వివిధ పథకాలను, విధానాలను రూపొందించడం జరిగింది.  గ్రామీణులకు సమాజంలో ఒక స్థానమును కల్పించి మారుతున్న సమాజ పరిస్థితులకు అనుగుణంగా ఉత్తమ వీరులుగా వారిని తయారు చేయుటకు ప్రభుత్వము తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది.  అయితే విద్యయనునది జాతీయ కార్యక్రమము అందుచేత ఈ కార్యక్రమమునకు జాతి యావత్తు సహాయ సహకారాలు అందజేయవలసి ఉంది.

21వ శతాబ్ధి ప్రారంభము నాటినుండి పాఠశాలకు వెళ్ళని పిల్లలు, నిరక్షరాస్యులైన వయోజనులు ఉండరాదని లక్ష్యంగా నిర్ణయించినారు.   ఈ లక్ష్యాన్ని సాధించేందుకు విద్య అనేది ఒక ప్రజా ఉద్యమంగా రూపొందాలి.  అప్పుడే అది విజయవంత మౌతుంది.

సంప్రదిత గ్రంథాలు :-

గ్రామీణ విద్య – కె. పద్మలత, కె. మురళీమనోహర్‌ ఎస్‌.డి.ఎల్‌.సి.ఇ., ప్రచురణ :కె.వి. క్యాంపస్‌.

ఆధారము: భూమిక

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate