অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఆరోగ్యానికి ఆహారం

ఆకు కూరలు

తోటకూర నేత్రములకు మంచిది, విరేచనము కాగోరు వారికి అత్యంత మంచిది. భోజనం చేసిన వెంటనే ఏదో ఒక ఫలాన్ని భుజించుట ఆరోగ్యమునకు చాలా మంచిది. ఫలములన్నింటిలో ద్రాక్షపండు శ్రేష్ఠం. దానిమ్మ గర్భిణీ స్త్రీలకు శ్రేష్ఠం. నారింజపండు స్త్రీలలో నెలవారీ ఋతుస్రావమును క్రమబద్ధీకరించును. ముట్టునొప్పిని తగ్గించును, చర్మానికి కాంతిని కలిగిస్తుంది, మొటిమలను తగ్గిస్తుంది.

బచ్చలి కూర : మధురరసం కలిగి ఉంటుంది. బలాన్ని కలుగచేస్తుంది. శుక్రవృద్ధిని కలిగిస్తుంది. కఫం ఎక్కువవుతుంది. చలువ చేస్తుంది.

పాలకూర : బలకరము, నేత్రములకు మంచిది. చలువ చేయును, రుచిగా నుండును, అతిగా తీసుకొన్నచో మూత్రపిండములలో రాళ్ళు ఏర్పడతాయి.

గోంగూర : అత్యంత ఉష్ణవర్థకము, బలం, రక్తవృద్ధిని కలుగచేయును.

తోటకూర : చలువ చేయును, నేత్రములకు మంచిది, మలమూత్రములను జారీ చేయును. విరేచనము కాగోరు వారికి అత్యంత మంచిది.

ఫలములు

భోజనం చేసిన వెంటనే ఏదో ఒక ఫలాన్ని భుజించుట ఆరోగ్యమునకు చాలా మంచిది . ఆయా ఋతువులలో లభించు అన్ని ఫలములను తప్పక వాడవలయును.

ద్రాక్ష: ఫలములన్నింటిలో ద్రాక్షపండు శ్రేష్ఠమయినది, చలువ చేయును. నేత్రములకు మంచిది , బలమును కలుగచేయును. మలమూత్రములను జారీ చేయును , శుక్రవృద్ధిని కలిగిస్తుంది, రుచిని కలిగించును. దప్పికను తగ్గించును. జ్వరము, శ్వాస, వాత రోగములందు, కామెర్లు, మూత్ర రోగములందు, రక్తస్రావములందు అత్యంత మంచిది. ద్రాక్షపండ్లు తాజాగాను మరియు ఎండు ద్రాక్షపండ్లుగాను దొరుకును. ఎండు ద్రాక్ష అత్యంత గుణవత్తరం.

ఖర్జూర : ఇది కూడా తాజా పండుగను, ఎండబెట్టినవిగాను దొరుకును. హృదయమునకు మంచిది. ఛాతి వ్యాధులందు, క్షయ రోగమందు మంచిది. రక్తస్రావ రోగములందు హితకరం, దగ్గు ఆయాసంలను తగ్గించును. దప్పికను తగ్గించును, బలకరం, శుక్రవృద్ధి కరం.

ఎండు ద్రాక్ష, ఖర్జూర కాయలను పగులగొట్టి నీటిలో నానవేసి త్రాగిన వేసవిలో దాహము, ఎండ వేడిమి నుండి ఉపశమనము కలుగచేయును. చంటి పిల్లలకు త్రాగించుట వలన వడదెబ్బ తగలనీయదు.

దానిమ్మ : దాహము, జ్వరము, హృద్రోగము, కంఠ రోగములందు మంచిది. నోటి దుర్వాసనను పోగొట్టును. శుక్రవృద్ధిని కలిగించును. పైత్యమును తగ్గించును, గర్భిణీ స్త్రీలకు శ్రేష్ఠం.

 

మామిడి : హృదయమునకు మంచిది. బలమును కలిగించును, వాతమును హరించును, శుక్రవృద్ధి కరం, రుచికరము, కాంతిని కలుగచేయును, శరీరమునకు చలువ చేయును.

 

 

 

అరటిపండు : చలువ చేయును, మలబద్ధము చేయును (త్వరగా జీర్ణము కాదు). బలము కలుగచేయును. దప్పిని తగ్గించును. రక్తస్రావము, క్షయ రోగములందు పథ్యము.

 

 

నారింజపండు : చలువ చేయును, దప్పికను తగ్గించును, రుచిని కలిగించును, మధుమేహమునందు పనిచేయును, పైత్యమును తగ్గించును, స్త్రీలలో నెలవారీ ఋతుస్రావమును క్రమబద్ధీకరించును. ముట్టునొప్పిని తగ్గించును, నులి పురుగులను నశింపచేసి, జీర్ణాశయ సంబంధ వ్యాధులను తగ్గించును. రక్తవృద్ధిని చేస్తుంది. చర్మానికి కాంతిని కలిగిస్తుంది, మొటిమలను తగ్గిస్తుంది.

పప్పు ధాన్యాలు

నువ్వులు చర్మమునకు మంచిది. స్తన్యమును వృద్ధి చేస్తుంది. దోసకాయ చర్మానికి, చర్మ సౌందర్యానికి మంచిది. ఉలవలు దగ్గు, ఆయాసం, జలుబులను తగ్గిస్తుంది. కాకరకాయ జ్వరం, రక్త దోషములను తొలగిస్తుంది. మధుమేహంను తగ్గిస్తుంది. కారట్ ముఖ్యంగా నేత్రములకు మంచిది. మునగ ఆకుల పట్టు వేస్తే చర్మవాపులు తగ్గుతాయి. టమోటా రక్తవృద్ధిని కలిగిస్తుంది.

శెనగలు : చలువ చేయును. రక్త దోషాన్ని పోగొడుతుంది. తేలికగా జీర్ణము కాదు.

ఉలవలు : వగరుగా ఉండును. వేడి చేస్తుంది. తేలికగా జీర్ణమగును. దగ్గు, ఆయాసం, జలుబును తగ్గిస్తుంది. మూత్ర పిండములలో ఉన్న రాళ్ళను కరిగిస్తుంది. నులిపురుగులను నశింపచేస్తుంది.

నువ్వులు : కటు, తిక్త, మధుర, కషాయ రసములు కలిగి ఉంటుంది. వేడి చేస్తుంది. గురుగుణం కలిగి ఉంటుంది. చర్మమునకు మంచిది. స్తన్యమును వృద్ధి చేస్తుంది. వాత రోగములను పోగొడుతుంది.

శాకములు (కూరగాయలు)

కంద : వగరుగా ఉంటుంది. ఆకలిని పుట్టిస్తుంది. మూలశంక వ్యాధిని పోగొడుతుంది. ప్లీహ రోగములలో పథ్యము. కుష్టు, చర్మ రోగములు కలవారు దీనిని తినరాదు.

పెండలము : చలువ చేయును, మలబద్ధం చేస్తుంది. తియ్యగా ఉంటుంది. తేలికగా జీర్ణం కాదు. బలకరము.

చిలగడదుంప : బలాన్ని ఇస్తుంది. తియ్యగా ఉంటుంది. హృద్రోగములలో మంచిది, కడుపుబ్బరమును కలిగిస్తుంది.

బంగాళాదుంప : తియ్యగా ఉంటుంది. బలకరము, కడుపుబ్బరమును కలిగిస్తుంది. జీర్ణం ఆలస్యమవుతుంది.

ముల్లంగి : కారంగా ఉంటుంది. వేడి చేస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. కామెర్లు, కాలేయ వ్యాధు లందు బాగా పని చేస్తుంది. మూత్ర పిండములలో రాళ్ళను కరిగించును.

కారట్ : తియ్యగా ఉంటుంది. ఆకలిని, జీర్ణ శక్తిని పెంచుతుంది. రక్తవృద్ధిని కలిగిస్తుంది. మూలవ్యాధిని తగ్గిస్తుంది, ముఖ్యంగా నేత్రములకు మంచింది.

అరటికాయ : తియ్యగాను, వగరుగాను ఉంటుంది. పైత్యమును తగ్గిస్తుంది. నులి పురుగులను నశింపచేస్తుంది.

 

గుమ్మడికాయ : చలువ చేస్తుంది, బలాన్ని కలిగిస్తుంది, రక్తస్రావాన్ని అరికడుతుంది. మూత్రాన్ని జారీ చేస్తుంది.

సొరకాయ : హృదయానికి మంచిది, మూత్రంను జారీ చేస్తుంది.

దోసకాయ : చలువ చేయును, మూత్రాన్ని జారీ చేయును, చర్మానికి, చర్మ సౌందర్యానికి మంచిది.

పొట్లకాయ : అత్యంత పథ్యం. బలాన్ని ఇస్తుంది. రుచిని కలిగిస్తుంది. హృదయమునకు మంచిది, నులిపురుగులను నశింప చేస్తుంది. పైత్యమును, వాతాన్ని తగ్గిస్తుంది. శుక్రవ్రుద్ధిని కలిగిస్తుంది.

కాకరకాయ : చేదుగా ఉంటుంది. జ్వరం, రక్త దోషములను తొలగిస్తుంది. మధుమేహంను తగ్గిస్తుంది. జ్వరం, నులి పురుగులను నశింప చేస్తుంది.

బీరకాయ : చలువ చేయును. తియ్యగా ఉంటుంది. పైత్యమును తగ్గించును, జీర్ణం చేస్తుంది. జ్వరం, ఆయాసములలో పథ్యంగా పని చేస్తుంది. నులి పురుగులను పోగొడుతుంది.

దొండకాయ : చలువ చేయును, మందము చేస్తుంది, మలబద్ధాన్ని కలిగిస్తుంది. తేలికగా జీర్ణం కాదు, పైత్యాన్ని తగ్గిస్తుంది.

వంకాయ : లేత వంకాయాలనే వాడాలి. ఇవి అత్యంత పథ్యము, కఫం, వాతములను తగ్గిస్తుంది. తేలికగా జీర్ణమగును, మలమూత్రములను జారీ చేయును. బలకారి, చర్మ వ్యాధులందు వాడరాదు. ముదిరిన వంకాయ వాడరాదు, దురదలను పుట్టిస్తుంది.

మునగకాయ : మధుర, కషాయ రసంలు కలిగి ఉంటుంది. కడుపు నొప్పిని తగ్గిస్తుంది. కుష్టు, క్షయ, ఆయాసం వ్యాధు లలో మంచిది. మునగ ఆకుల పట్టు వేస్తె చర్మ వాపులు తగ్గుతాయి.

బెండకాయ : వేడి చేస్తుంది. మలబద్ధమును చేస్తుంది. రుచిని కలిగించును.

టమోటా : రక్త వృద్ధి చేస్తుంది. పులుపు గుణాన్ని కలిగిస్తుంది. పైత్యం చేస్తుంది. ఆకు కూరలతో కలిపి తింటే మూత్ర పిండములలో రాళ్ళు పడతాయి.

నిత్య ఆహార పదార్థాలు

ప్రపంచంలో ఏ దేశంలో కూడా మన దేశంలో ఉన్నటువంటి చక్కని, యోజనాబద్ధమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహార పధ్ధతి లేదని చెప్పవచ్చు. మానవులు రోజూ ఉదయం, సాయంత్రం రెండుసార్లు మాత్రమే ఆహారం తీసుకోవాలి. ఈ నియమం బాలురకు, రోగులకు వర్తించదు. ప్రతిపూటా భోజనం చేసేముందు రెండు అల్లం ముక్కలను ఉప్పు అద్దుకొని తినడం వలన ఆకలి పుట్టును.

నిత్య ఆహార పధ్ధతి : యుక్తాయుక్త విచక్షణ లేక జిహ్వ చాపల్యంతో అతిగా భుజించు వారిని అజీర్ణము పట్టి వేధించి అనేక రోగములకు కారణమవుతుంది. మనం తినే ఆహారం హితంగా, మితంగా ఉండాలని మన ప్రాచీనులు నిర్ణయించారు. సృష్టిలోని అనేక ద్రవ్యాలను ఆహారంగా యోజన చేసి మనకందించారు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా మన దేశంలో ఉన్నటువంటి చక్కని, యోజనాబద్ధమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహార పధ్ధతి లేదని చెప్పవచ్చు.

మానవులు రోజూ ఉదయం, సాయంత్రం రెండుసార్లు మాత్రమే ఆహారం తీసుకోవాలి. ఈ నియమం బాలురకు, రోగులకు వర్తించదు.

వేడిగా, తాజాగా ఉండు ఆహారాన్ని సేవించాలి. ఆయా ఆహార పదార్థములను చక్కగా వండి, శుభ్రమైన ప్రదేశంలో తినాలి. శుభ్రతను పాటించాలి. తొందరగా భుజించరాదు.

భోజన ప్రారంభంలో తీయని పదార్థములు, తర్వాత పుల్లని పదార్థములు, కారము గల పదార్థములు, చివర మజ్జిగ లేక పాలు కలుపుకొని తినాలి. భోజనం చివరిలో అరటిపండు కాని, ఆయా ఋతువులలో లభించే పండును కాని తినాలి. ప్రతిపూటా భోజనం చేసేముందు రెండు అల్లం ముక్కలను ఉప్పు అద్దుకొని తినడం వలన ఆకలి పుట్టును.

మనం నిత్యం వాడే ఆహార పదార్థాలు - వాటి గుణాలు : ధాన్యాలు, బియ్యము, గోధుమలు మొదలైనవి నిత్య ఆహార పదార్థాలు. వాటిలో బియ్యము తేలికగా జీర్ణమై చలువ చేస్తుంది. బలకరము. గోధుమలు తేలికగా జీర్ణము కాదు, చలువ చేయును. బలకరము.

పప్పులన్నియు సహజంగా బలమైనవైనను తేలికగా జీర్ణం కావు. అపానవాయువు (గ్యాస్) ను కలుగచేయును. మల మూత్రములను బంధించును. బాగా జీర్ణశక్తి గలిగినవారు మాత్రమే పప్పులను ఎక్కువగా వాడాలి. పప్పులలో శ్రేష్ఠమైనవి పెసర్లు.

పెసర్లు : తేలికగా జీర్ణమగును. చలువ చేయును. కండ్లకు మంచిది. అన్నిటికంటే నల్ల పెసర్లు శ్రేష్ఠమైనవి .

మినుములు : తేలికగా జీర్ణం కాదు. బలకరము, శుక్రవృద్ధి చేయును. చంటి పిల్లల తల్లులకు స్తన్యమును వృద్ధి చేయును. శరీరములో క్రొవ్వును పెంచును. మూలశంక వ్యాథులలో మంచిది.

బొబ్బర్లు : తేలికగా జీర్ణం కాదు, స్తన్యమును వృద్ధి చేయును.

కందులు : తేలికగా జీర్ణమగును. చలువ చేయును. రక్తదోషాన్ని పోగొడుతుంది. బలకరము.

చక్కని ఆరోగ్యానికి చక్కని దినచర్య

రాగి పాత్ర

రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని నిద్ర లేచిన వెంటనే త్రాగుట వలన మూలశంక, జ్వరము, రక్తపిత్తము, శోధ (వాపులు), కుష్టము, శరీరము లావెక్కుట మొదలగు రోగాలు రావు. వార్ధక్య లక్షణములు లేక మానవుడు 100 సంవత్సరములు ఆరోగ్యముగా జీవించును. కనీసం వారమునకు ఒకసారి నువ్వుల నూనెతో తైలమర్దన చేయుటవలన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. వ్యాధులు రావు.

ప్రాతఃకాలమున జలపానము : నిద్రించే ముందు రాత్రి రాగి పాత్రలో నీటిని సుమారు 800 మీ.లీ. వరకు నిల్వ ఉంచవలయును. ఆ నీటిని మరునాటి ఉదయం నిద్ర లేచిన వెంటనే త్రాగవలయును. ఇటుల చేయుటవలన మూలశంక, జ్వరము, రక్తపిత్తము, శోధ (వాపులు), కుష్టము, శరీరము లావెక్కుట మొదలగు రోగాలు రావు. వార్ధక్య లక్షణములు లేక మానవుడు 100 సంవత్సరములు ఆరోగ్యముగా జీవించును. అటులే ముక్కు రంధ్రములను 300 మీ.లీ. నీటిని పీల్చి శుభ్రము చెసుకొన వలయును. ఈ విధముగా చేయుట వలన పడిశం, తుమ్ములు, దగ్గు, ముక్కులో వచ్చే వ్యాధులు తగ్గును. ఈ క్రియను యోగ, ప్రకృతి చికిత్సల్లో నేటికినీ చేయుచున్నారు.

ముక్కు రంధ్రములను నీటిని పీల్చి శుభ్రము చేయుట

వ్యాయామము : ఆరోగ్య పరిరక్షణకై ప్రతిరోజూ తేలికగా బలము ననుసరించి వ్యాయామం చేయవలయును. శరీరమునకు ఆయాసం కలిగించు పనిని వ్యాయామమందురు. అన్ని ఋతువుల యందును అర్థ బలముగా వ్యాయామం చేయవలయును. అర్థ బలమనగా నోటి ద్వారా వాయువు బయటకు వెడలు అవస్థ. నుదురు, చంకలు, కాళ్ళు, చేతుల యందు చెమట పుట్టిన అర్థబలమని తెలుసుకుని వ్యాయామం ఆపివేయాలి. అంతకంటే ఎక్కువగా వ్యాయామం చేయరాదు. వ్యాయామం నిమిత్తం ఆయా వ్యక్తుల ఆరోగ్యాన్ననుసరించి సూర్యనమస్కారములు, యోగాసనములు, వేగముగా నడచుట లేక ఆటలు ఆడుట మొదలైనవి చేయవచ్చును.

సూర్యనమస్కారములు

అభ్యంగము : అభ్యంగమనగా శరీరమంతటా తైల మర్దన చేయుట. తైల మర్దన వలన శరీరమునందలి అన్ని అవయవములు చైతన్యవంతమగును. కండరములకు బలము కలుగును. నాడీ మండలము ఉత్తేజితమగును. రక్త ప్రసరణ బాగుగా జరుగును. చర్మకాంతి, సౌందర్యము పెరుగును. శరీరము తేలికగానగును. వాత వ్యాధులను రానివ్వదు. శరీర పటుత్వము పెరిగి పుష్టి, ఆయుష్షు పెరుగును. చక్కటి నిదుర కలిగించును.

ఆరోగ్యమును కోరువారు ప్రతిరోజూ ఉదయం కాలకృత్యముల తరువాత తైలమర్దన చేసుకొనుట మంచిది. చేతుల చివరి నుండి భుజముల వరకు, అటులే కాళ్ళు చివరి నుండి తొడల భాగము వరకు, కీళ్లలో గుండ్రముగా, ఛాతీపై ఎక్కువ వత్తిడి లేక మృదువుగా, వెన్నెముక పైనుండి క్రిందకు మరల క్రింది నుండి పైకి మర్దన క్రియ చేయవలయును. ప్రతిరోజూ కుదరక పోయినచో కనీసం వారమునకు ఒకసారి నువ్వుల నూనెతో తైలమర్దన చేయుటవలన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. వ్యాధులు రావు.

వంటింటి వైద్యశిఖామణి - వెల్లుల్లి

మాంసాహారం మరియు ఎక్కువగా నూనె, క్రొవ్వు పదార్థములు తినేవారు వెల్లుల్లి తప్పని సరిగా వాడాలి. వెల్లుల్లి మాంసాహారం మరియు ఇతర క్రొవ్వు పదార్ధములలో ఉన్న క్రొవ్వునకు విరుగుడుగా పని చేస్తుంది. గుండె జబ్బులను రానివ్వదు. వెల్లుల్లి పట్టు వేసిన తలనొప్పి, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. వెల్లుల్లిని పాలతో కలిపి ఉడికించి త్రాగించిన అస్తమా, క్షయ, నిమోనియా తగ్గుతాయి. జలుబు తగ్గుతుంది.

వెల్లుల్లి (లశున) : ఆయుర్వేదములో వెల్లుల్లి రసాయనముగా చెప్పబడినది. పక్షవాతము మొదలుకొని కుష్ఠు, గుండె జబ్బులు, కీళ్ళ నొప్పులు, జ్వరము, జీర్ణాశయ వ్యాధులు మొదలైన అనేక వ్యాధులలో వెల్లుల్లికి మించిన ఔషధం లేదు. వెల్లుల్లి అత్యుత్తమమైన జీర్ణకారిగా పని చేస్తుంది. ప్రధానంగా మాంసాహారం మరియు ఎక్కువగా నూనె, క్రొవ్వు పదార్థములు తినేవారు వెల్లుల్లి తప్పనిసరిగా వాడాలి. వెల్లుల్లి మాంసాహారం మరియు ఇతర క్రొవ్వు పదార్ధములలో ఉన్న క్రొవ్వునకు విరుగుడుగా పని చేస్తుంది. గుండె జబ్బులను రానివ్వదు. గుండె జబ్బులు కలవారు బాగా లావుగా ఉన్నవారు ప్రతిరోజూ రెండు లేక మూడు చిన్నపాయలను తీసుకుంటే లావు తగ్గుతారు. స్త్రీలలో కలిగే వ్యాధులలో వెల్లుల్లి అత్యుత్తమంగా పని చేస్తుంది. ఋతు దోషములను పోగొట్టి సంతానాన్ని కలిగిస్తుంది. ఊపిరితిత్తుల వ్యాధులలో వెల్లుల్లిని పాలతో కలిపి ఉడికించి త్రాగించిన ఆస్త్మా, క్షయ, నిమోనియా తగ్గుతాయి. జలుబు తగ్గుతుంది. వెల్లుల్లి పట్టు వేసిన తలనొప్పి, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. చర్మ వ్యాధులను తగ్గించి, చర్మానికి కాంతిని కలిగిస్తుంది. వెల్లుల్లిపాయలను దంచి ఆ రసాన్ని 10 చుక్కల చొప్పున రోజుకి రెండు సార్లు త్రాగించిన కోరింత దగ్గు తగ్గుతుంది. పక్షవాతం, ఆర్జితవాతం (ముఖం వంకర పోవుట), కీళ్ళవాతం లలో వెల్లుల్లి అత్యుత్తమంగా పని చేస్తుంది. శుక్రవృద్ధికారి. చెవిపోటు తగ్గుతుంది.

గమనిక : వెల్లుల్లి అతిగా తింటే రక్తస్రావం, రక్తంతో కూడిన వాంతులు, రక్త విరేచనాలు రావచ్చును. కాబట్టి తగు మోతాదులో జాగ్రత్తగా సేవిస్తే అమృతముగా పని చేస్తుంది. ఉష్ణ తత్వము కలిగిన వారు, సుకుమారులు, వెల్లుల్లిని సేవించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఆధారము: లోకహితం బ్లాగు

చివరిసారిగా మార్పు చేయబడిన : 7/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate