অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వ్యాధులు - వైద్యుల సూచనలు

రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ పెరిగితే

నాకు 40 సం.రాలు. నేను ఈ మధ్య హెల్త్ చెకప్ చేయించుకున్నాను. టెస్ట్ రిపోర్ట్‌లో రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నాయని తెలిసింది. డాక్టర్‌ని సంప్రదిస్తే కొన్ని మందులు వాడమన్నారు. రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉంటే ఫ్యూచర్‌లో హార్ట్‌ఎటాక్ వచ్చే అవకాశం ఎక్కువని విన్నాను. నాకు హార్ట్‌ఎటాక్ వచ్చే అవకాశం ఉందా? రాకుండా తీసుకోవలసిన సూచనలు చెప్పండి.

మీరు చెప్పినదానిని బట్టి చూస్తే మీకు రక్తంలో ఒక రకమైన చెడు కొలెస్ట్రాల్ వంటి కొవ్వులు (ట్రైగ్లిజరైడ్స్) ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. క్రమం తప్పకుండా సరైన మందులు వాడుతూ, ఆహార నియమాలను పాటిస్తూ, కార్డియాలజిస్ట్ సూచన లను అనుసరిస్తే మీ రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్‌ని తగ్గించటానికి ఆస్కా రం ఉంది. మామూలుగా చెడ్డ కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తో పోలిస్తే ట్రైగ్లిజరైడ్స్ వల్ల గుండెకు వచ్చే నష్టం తక్కువ. మీరు తీసుకునే ఆహారంలో పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్స్) ఉండే అన్నం, రొట్టెల పాళ్లను తగ్గించి... ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండటం మంచిది. మీరు ఖచ్చితమైన ఆహార నియమ నిబంధనలు పాటిస్తూ కొవ్వుపదార్థాలను తీసుకోవటం పూర్తిగా తగ్గించి... వాకింగ్, ఎక్సర్‌సైజ్ చేస్తూ ఉంటే మీరు నిర్భయంగా నిండుజీవితాన్ని గడపవచ్చు.

మా తాతగారికి 70 సం.రాలు. ఆయనను ఈ మధ్య ఫ్యామిలీ డాక్టర్‌కి చూపించాం. బ్లడ్‌ప్రెజర్ 190/70 ఉందని చెప్పి కొన్ని మందులు వాడమని చెప్పారు. వయస్సు పెరుగుతుంటే బీపీ కొంచెం పెరగటం సాధారణమని మందులు వాడవలసిన అవసరం లేదని నా ఫ్రెండ్ ఒకరు అంటున్నాడు. మందులు ఆపడం మంచిదేనా తెలుపగలరు?

ఏ వయస్సు వారికైనా బీపీ 140/90 కంటే అధికంగా ఉంటే... దాన్ని హైపర్ టైన్షన్ (అధిక రక్తపోటు) అంటారు. వయస్సు ఎంత ఉన్నా బీపీ ఎక్కువగా ఉంటే మందులు వాడటం అవసరం. మీ మిత్రుడు చెప్పినట్లుగా వయస్సు పెరుగుతుంటే బీపీ కాస్త పెరగటం మామూలే. అయితే అది 140/90 దాటితే దాన్ని నియంత్రణలో ఉంచడానికి మందులు తప్పనిసరిగా వాడాల్సిందే. మీ తాతగారికి బీపీలో పైన ఉండే విలువ (సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్) మాత్రమే ఎక్కువగా ఉండి... కింద విలువ (డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్) నార్మల్‌గా ఉంది. దీన్ని ఐసొలేటెడ్ సిస్టోలిక్ హైపర్ టెన్షన్ అంటారు. అయితే దీనికి కూడా ట్రీట్‌మెంట్ అవసరం. బీపీ మందులతో పాటు స్టాటిన్ అనే మాత్రలు వాడితే భవిష్యత్తులో వచ్చే పక్షవాతం, గుండెపోటు వంటి ప్రమాదాలు రాకుండా నివారించడానికి ఆస్కారం ఉంటుంది.

గాల్‌బ్లాడర్‌లో రాళ్లు..ఏంచేయాలి

నా వయస్సు 50. నాకు ఏడాది క్రితం కడుపులో నొప్పి, కామెర్లు వస్తే ఆసుపత్రికి వెళ్లాను. వైద్య పరీక్షల్లో గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నట్లు తేలింది. డాక్టర్లు ఉఖఇ్క టెస్ట్ చేసి స్టెంట్ వేశారు. ఇటీవల నెల రోజుల నుంచి జ్వరం వస్తోంది. కళ్లు పచ్చగా అవుతున్నాయి. మళ్లీ కామెర్లు వస్తున్నాయేమోనని భయంగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వగలరు.

మీరు గాల్‌స్టోన్స్, సిబిడీ స్టోన్స్ అనే సమస్యతో బాధపడుతున్నారు. ఏడాది క్రితం మీకు కడుపులో వేసిన బిలిమరీ స్టెంట్ మూసుకుపోయి ఉండవచ్చు. అందువల్ల మీకు జ్వరం వస్తోంది. కామెర్లు రావడానికి కూడా ఇదే కారణం. కాబట్టి మీరు వీలైనంత త్వరగా మళ్లీ ఉఖఇ్క చేయించుకోగలరు. ఉఖఇ్క అనేది ఎండోస్కోపీ ద్వారా చేసే పరీక్ష, చికిత్సా విధానం.

ఈ పరీక్ష ద్వారా మీకు సిబిడిలో రాళ్లు ఉన్నా తొలగించవచ్చు. మూసుకుపోయిన స్టెంట్ స్థానంలో కొత్త స్టెంట్ అమర్చవచ్చు. ఉఖఇ్క చేయించుకున్న తరువాత లాప్రోస్కోపీ ద్వారా గాల్‌బ్లాడర్ తొలగించుకోవలసి ఉంటుంది. లేకపోతే మళ్లీ మళ్లీ ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఇంతకుముందే మీరు ఆపరేషన్ చేయించుకొని ఉంటే బాగుండేది. ఇప్పటికైనా వీలైనంత త్వరగా గాల్‌బ్లాడర్ సర్జరీ చేయించుకుంటే మీ సమస్య తొలగిపోతుంది.

నా వయస్సు 41 సంవత్సరాలు. నేను చాలా ఏళ్ల నుంచి ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నాను. మూడు నెలల క్రితం ్కఅూఖీౖఇఐఈఏ్క టాబ్లెట్లు ఒక వారం పాటు వాడాను. ప్రస్తుతం ఒమేజ్ బిళ్లలు వాడుతున్నాను. అయినా కడుపులో నొప్పి తగ్గడం లేదు. మలబద్ధకం సమస్య ఉంది. తలనొప్పి కూడా ఉంటోంది. నా సమస్యకు తగిన పరిష్కారం సూచించగలరు.

మీరు మూడు నెలల క్రితం ్కఅూఖీౖఇఐఈఏ్క వాడానని చెబుతున్నారు. ప్రస్తుతం మందులు వాడుతున్నా ఫలితం కనిపించడం లేదంటున్నారు. మీరు ఎండోస్కోపీ చేయించారా, లేదా అనే విషయం రాయలేదు. ఒకవేళ ఎండోస్కోపీ చేయించనట్లయితే గ్యాస్ట్రో ఎంటరాలజిస్టుని కలిసి పరీక్ష చేయించుకోండి.

రెండవది మలబద్ధకం, కడుపులో నొప్పి ఉందని అంటున్నారు. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనే వ్యాధి వల్ల ఇలా జరిగే అవకాశం ఉంది. ఈవ్యాధితో బాధపడుతున్నప్పుడు మలబద్ధకం, కడుపులో నొప్పి ఉంటుంది. ఆహారపు అలవాట్లు, యాంగ్జైటీ, ఒత్తిడి వల్ల ఇది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒకసారి గ్యాస్ట్రో ఎంటరాలజిస్టుని కలిసి తగిన చికిత్స తీసుకుంటే సమస్య తగ్గిపోతుంది.

నా వయస్సు 27. నాకు కడుపులో నొప్పి వచ్చి బరువు తగ్గిపోతుంటే డాక్టర్ దగ్గరకు వెళ్లాను. చిన్న ప్రేవులకు టీ.బీ ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. ఆరునెలల పాటు మందులు వాడాను. కానీ టీ.బీ పూర్తిగా తగ్గిందా, లేదా అనే సందేహం ఉంది. చిన్న ప్రేవులకు టీ.బీ వస్తే మందులతో పూర్తిగా తగ్గిపోతుందా? ఇతర చికిత్సలు ఏమైనా అందుబాటులో ఉన్నాయా తెలియజేయగలరు.

మామూలుగా చిన్న ప్రేవుల టీ.బీ వలన పేగులో పుండ్లు తయారవుతాయి. ఈ సమస్య మందుల వల్ల పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది. అలాకాకుండా 'చిన్న ప్రేవుల స్ట్రిక్షర్స్ ' మాదిరిగా వస్తే టీ.బీ కంట్రోల్ అయినప్పటికీ అప్పుడప్పుడు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం లభించే టీ.బీ మందులను క్రమంతప్పకుండా వాడితే వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది.

మళ్ళీ నడవగలుగుతానా!

నా వయసు 30. కూలీ పనిచేస్తుంటాను. కొద్దిరోజుల క్రితం రెండవ అంత స్థునుంచి జారి కింద పడిపోయాను. క్షణాల్లో తీవ్రమైన వెన్నునొప్పి మొదలయ్యింది. రెండు కాళ్లూ కదలడంలేదు. మావాళ్లు హాస్పిటల్‌కు తీసుకువెళితే ఎక్స్‌రే తీసి డి-12 పూస దెబ్బ తిన్నదని చెప్పారు. ఆ తరువాత ఎంఆర్ఐ పరీక్ష కూడా చేయించి శస్త్ర చికిత్స చేయక తప్పదన్నారు. శస్త్ర చికిత్స నిజంగానే అవసరమా ? ఆ తరువాతైనా నేను తిరిగి నడవగలుగుతానా ? నాకు సరియైన సలహా ఇవ్వండి.

వెన్నుపూసల్లో డి-12 అన్నది దాదాపు చివ రలో ఉంటుంది. ఆ తరువాత ఇక నరాలే ఉంటాయి. ఈ భాగంలో దెబ్బ తగలడాన్ని వెడ్జ్ కాంప్రెషన్ ఫ్రాక్చర్ అంటారు. ఈ ప్రమాదంలో రెండు కాళ్లూ పడిపోతాయి. ఈ స్థితిలో శస్త్ర చికిత్స అవసరమవుతుంది. వెన్నెముకలో ఫెడికల్ అనే ఒక భాగం ఉంటుంది. పెడికల్‌లో దెబ్బ తిన్న భాగానికి పైకింది భాగాలు దగ్గరగా వచ్చేలా పై భాగంలో ఒక ప్లేట్ వేసి స్క్రూల ద్వారా బిగిస్తాం. దీనివల్ల చితికిపోయిన వెన్నెముక మళ్లీ సాధారణ స్థానానికి వచ్చేస్తుంది.

ఈ శస్త్ర చికిత్సను పెడికల్ స్క్రూ ఫిక్సేషన్ అనే విధానంలో చేస్తాం. అయితే ఈ శస్త్ర చికిత్సను సాధ్యమైనంత త్వర గా చేయాలి. ఒకవేళ ఎక్కువ కాలం అలాగే వదిలేస్తే ఆ భాగం శాశ్వతంగా దెబ్బతిని పక్షవాతం జీవితాంతం ఉండిపోయే ప్రమాదం ఉంది. త్వరగా శస్త్ర చికిత్స చేయించుకుంటే ఈ సమస్యనుంచి పూర్తిగా బయటపడవచ్చు. మళ్లీ మునుపటిలా నడవడంలో ఏ ఆటంకమూ ఉండదు.

మా బాబుకు రెండేళ్లు. ఇన్నిరోజులుగా ఎందుకో నా దృష్టిపడలేదు. నెల రోజుల క్రి తం చూస్తే బాబుకు వెన్నెపూస మీద ఒక గుత్తిలా వెంట్రుకలు కనపించాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే ఇదేమీ భయపడవలసిన విషయం కాదు. అసలీ వెంట్రుకలు ఎందుకు వస్తాయి? ఈ స్థితివల్ల మునుముందు ఏమైనా తీవ్రసమస్యలు వచ్చే ప్రమాదం ఉందా ? కొందరేమో ఇది ప్రమాదకరమైన వ్యాధిగా చెబుతున్నారు. నాకు చాలా ఆందోళనగా ఉంది. ఈ వ్యాధికి సంబంధించి పూర్తి వివరాలు తెలియచేయండి.

వెన్ను పూస మీద అలా వెంట్రుకలు రావడాన్ని "స్పైనా బైఫిడా అకల్టా'' అంటారు. నిజానికి ఈ వ్యాధిలో ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ మీ బాబు సమస్య మాత్రం చాలా చిన్నది. సహజంగా గర్భంలో ఉన్న 8 నుంచి 12 వారాల మధ్య శిశువు వెన్నుపూస తయారవుతుంది. ఈ తయారీలో ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్ బాగా తోడ్పడుతుంది. ఈ విటమిన్ లోపం ఉన్నప్పుడు వెన్నెముకకు సంబంధించిన కొన్ని సమస్యలు వచ్చే వీలుంది. వాస్తవానికి మీ బాబుకు ఉన్న ఈ స్పైనా బైఫిడా వల్ల వెన్నెముకలో మిగతా భాగమంతా బాగానే ఉంటుంది.

కానీ, లామినా అనే భాగమే వెన్నుభాగంలో సరిగ్గా ఒదిగినట్లు ఉండదు. కాస్త విడి గా ఉండి ఆ భాగంలో కొంత ఖాళీ ఉంటుంది. ఆచోటే ఇలా వెంట్రుకలు మొలుస్తూ ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా కొందరికి మెనింగో సీల్ అనే సమస్య వస్తుంది. ఇది పుట్టుకతోనే వచ్చే సమస్య. ఇక మూడవది మెనింగో మైలోసీల్. ఈ సమస్యలో పుట్టుకతోనే పక్షవాతం ఉంటుంది.

ఇది ఒకరకంగా ప్రాణాంతకమైనదే. శస్త్ర చికిత్స ద్వారా ప్రాణాపాయాన్ని ఆపవచ్చు కానీ, ఈ పక్షవాతాన్ని మాత్రం ఏమీ చేయలేం. ఇందులో నాలుగో రకం మరికాస్త భిన్నమైనది. ఇందులో అసలు వెన్నెముకే తయారు కాదు. ఈ సమస్యను 'రాకిస్‌కిసిస్' అంటారు. ఇవి ప్రాణహాని కలిగించేవే. అయితే మీ బాబుకు వచ్చిన సమస్య పూర్తిగా వేరు. దాని వల్ల మీ బాబుకు ఏ నష్టమూ ఉండదు. కాళ్లలో బలహీనతగానీ, భవిష్యత్తులో నడుమునొప్పి రావడం గానీ ఇలాంటివేమీ ఉండవు.

నా వయసు 60. నాకు చాలాకాలంగా పొగతాగే అలవాటు ఉంది. ఒక ఫర్లాంగు దూరం నడవగానే కాళ్లు బరువెక్కినట్లయి, కాళ్లు తిమ్మిర్లు వస్తుంటాయి. అయితే వెంటనే కూర్చుంటే ఓ 10 నిమిషాల్లో తిమ్మిర్లన్నీ పోతాయి. తగ్గాయి కదా అనుకుని నడక సాగిస్తే ఓ ఫర్లాంగు నడవగానే మళ్లీ అదే సమస్య. ఈ సమస్య నాకు సుమారు ఒక ఏడాదిగా ఉంది. నడవడం అలా ఉంచి ఈ మధ్య నిలబడటమే కష్టంగా ఉంది. ఇలా ఎందుకు జరుగుతోంది ? దీనికి నివారణేమిటో తెలియచేయండి.

మీకున్న సమస్యను స్పైనల్ కెనాల్ స్టెనోసిస్ అంటారు. పొగతాగే వారిలో ఈ సమస్య ఎక్కువగా వ స్తుంది. నడుస్తున్నప్పుడు హఠాత్తుగా కాళ్లల్లో తిమ్మిర్లు రావడాన్ని క్లాడికేషన్ అంటారు. ఇలా వచ్చే తిమ్మిర్లు రెండు రకాలు. మొదటిది న్యూరలాజికల్ క్లాడికేషన్ ఇది వెన్నుపాముకు సంబంధించింది. రెండవది ఆర్టీరియల్ క్లాడికేషన్.

ఇది రక్తనాళాలకు సంబంధించింది. సాధారణంగా వెన్నెముక లోపల కొంత ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీలో వెన్నుపూస ఉంటుంది. కొన్ని సార్లు ఇందులో రక్తప్రసరణ తగ్గిపోతుంది. ఈ కారణంగానే హఠాత్తుగా కాళ్లల్లో తిమ్మిర్లు వస్తాయి. విశ్రాంతి తీసుకున్నప్పుడు రక్తప్రసరణ కాస్త మెరుగుపడి మళ్లీ నడుస్తారు. ఇక ఆర్టీరియల్ సమస్యలో రక్తనాళాల్లో ఆటంకాలు ఏర్పడతాయి.

వీళ్లల్లో కూడా అవే లక్షణాలు దాదాపు అవే ఉంటాయి. వీరికి కూడా నడుస్తున్నప్పుడు తిమ్మిర్లు వస్తాయి. ర క్తనాళాల్లో ఏమైనా ఆటంకాలు ఉన్నాయేమో తెలుసుకోవడానికి కలర్ డాప్లార్ పరీక్ష చేయించవలసి ఉంటుంది. రిపోర్టు నార్మల్ అనే వస్తే అప్పుడు అది కేవలం వెన్నుపాము సమస్యగా తేలిపోతుంది. పొగతాగే వారిలో ఈ సమస్యఉన్నప్పుడు అది రక్తనాళాల సమస్య కాదని ఒకసారి తే ల్చుకోవలసి ఉంటుంది.

వెన్నుపాము సమస్యే అయినప్పుడు కొన్ని మందులతో పాటు నడుముకు ఒక బెల్టు కూడా ఇవ్వవలసి రావచ్చు. వీటితో ఏమాత్రం ఉపశమనం లేనప్పుడు వెన్నెముక నిడివిని పెంచడానికి ల్యామినెక్టమీ శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుంది. ఆ తరువాత తిమ్మిరి రావడం వంటి సమస్యలేమీ ఉండవు. పైగా ఈ సమస్య శాశ్వతంగానే తొలగిపోతుంది.

అనస్తీషియాతో ఇన్ని అవస్థలా?

నా వయసు 30. నేను గత రెండేళ్లుగా లుంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్ సమస్యలతో బాధపడుతున్నాను. నిజానికి మా పాప పుట్టినప్పటి నుంచే నాకు ఈ సమస్యలు మొదలయ్యాయి.ప్రసవ సమయంలో జరిగిన సిజేరియన్ కోసం ఇచ్చిన అనస్తీషియా వల్లే ఈ సమస్యలు వస్తాయని మా బంధువులు చెప్పారు. నాకు నొప్పితో పాటు వెన్నంతా బిగుసుకుపోయినట్లుగా ఉంటోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే దీనికి శస్త్ర చికిత్స ఒక్కటే మార్గమని చెప్పారు. శస్త్ర చికి త్స లేకుండా మందులతోనే సమస్య తగ్గే మార్గం ఉంటే చెప్పండి.

సిజేరియన్ ప్రసవం జరిగిన స్త్రీలలో చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారన్నది వాస్తవం. అయితే డిస్కుల మధ్య వాపు ఏర్పడటం వల్ల గానీ, డిస్కులు పక్కకు జరగడం వల్ల గానీ సమస్య తలెత్తినప్పుడు దానికి శస్త్ర చికిత్స వల్ల ఒరిగేదేమిటి? మహా అయితే అది తాత్కాలిక ఉపశమనాన్నే ఇస్తుంది.

దెబ్బ తిన్న డిస్కును తొలగించి కృత్రిమ డిస్కును పెడితే మిగతా డిస్కుల మాటేమిటి ? అలాగే పక్కకు జరిగిన డిస్కు భాగాన్ని కత్తిరించి వేస్తే మిగతా డిస్కులు పక్కకు జరగవన్న గ్యారెంటీ ఏమిటి ? స్పాండలైటిస్ గానీ, డి స్కు ప్రొలాప్స్ గానీ మొదలవడం అనేది డిస్కులు బలహీనపడ్డాయని చెప్పే ఒక గుర్తు మాత్రమే.

ఆ స్థితిలో ఒక డిస్కును తొలగిస్తే మరో డిస్కు కూడా అదే సమస్యకు గురవుతుంది. డిస్కులన్నీ శక్తివంతంగా మారే చికిత్సలు అందించడమే దీనికి సరియైన చికిత్స. ఆయుర్వేదం ఈ విధానాన్నే ఎంచుకుని చికిత్సలు అందిస్తోంది. శస్త్ర చికిత్సల అవసరం లేకుండానే ఈ సమస్యలను తొలగించే ఎన్నో మందులు ఆయుర్వేదంలో ఉన్నాయి. ఆయుర్వేద నిపుణున్ని సంప్రదిస్తే మీ సమస్యలు శాశ్వతంగా తొలగిపోతాయి.

నా వయసు 52. నేను సుమరు నాలుగేళ్లుగా రూమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్‌లతో బాధ పడుతున్నాను. రోజురోజుకీ సమస్య తీవ్రమవుతోంది. అతి చిన్న కీళ్లనుంచి పెద్ద కీళ్ల దాకా అన్నీ ప్రభావితమవుతున్నాయి. ఆర్థోపెడిక్ డాక్టర్ పర్యవేక్షణలో మందులు, స్టెరాయిడ్లు తీసుకుంటూనే ఉన్నాను. ఇవి తాత్కాలికంగా కాస్త ఉపశమనాన్ని ఇస్తున్నాయే తప్ప సమస్య పూర్తిగా మాత్రం పోవడం లేదు క్రమంగా నాకు కదలడమే కష్టమవుతోంది. నా సమస్యకు శాశ్వత పరిష్కారం చెప్పండి.

శరీరంలో వాత, పిత్త, కఫాలు సమతుల్యత కోల్పోయినప్పుడు తలెత్తే సమస్య రూమటాయిడ్ ఆర్థరైటిస్. ఆ గుణదోషాలను తొలగించే మందుల ద్వారా ఈ సమస్యను శక్తి వంతంగా నియంత్రించే అవకాశాలు ఉంటాయి. రుతుక్రమం ఆగిపోయిన స్త్రీలలో ఈ ఆర్థరైటిస్ సమస్యలు రావడం అన్నది సాధారణమే. హార్మోన్ల మార్పుల వల్ల గానీ, శరీరంలో క్యాల్షియం పరిమాణం తగ్గిపోయిన కారణంగా గానీ, ఈ సమస్యలు రావచ్చు.

దీనికి క్యాల్షియం సమృద్ధిగా లభించే ఆహార పానీయాలు బాగా తీసుకోవాలి. ఆకుకూరలు విరివిగా వాడాలి. రోజూ వాకింగ్ చేయడం కూడా చాలా అవసరం. ఈ జాగ్రత్తలకు తోడుగా ఆయుర్వేద ఔషధాలు తీసుకుంటూ, తైల మర్థనాలు కూడా చేయిస్తే మీ సమస్యలు ఇంక మిమ్మల్ని వేధించవు. చికిత్సలేవీ తీసుకోకుండా ఎక్కువకాలం అలాగే ఉండిపోతే కీళ్లు వంకర్లు పోయి అంగవైకల్యం లాంటిది ఏర్పడవచ్చు. అందుకే దగ్గరలో ఉన్న ఆయర్వేద వైద్యుణ్ని సంప్రందించండి. మీకు ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

నా వయసు 45. గత ఐదేళ్లుగా సైనసైటిస్ సమస్యతో బాధపడుతున్నాను. దీనికోసం రెండేళ్ల క్రితం ఒకసారి శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాను. ఓ ఆరు మాసాల పాటు బాగానే ఉన్నా ఆ తరువాత సమస్య మళ్లీ మొద టికి వచ్చింది. ఎప్పుడూ తలనొప్పిగా ఉంటుంది. దేనిమీదా మనసు లగ్నం కాదు. దీనికి తోడు నాకు అర్శమొలల సమస్య కూడా ఉంది. అప్పుడప్పుడు రక్తస్రావం కూడా అవుతోంది. దీనికి కూడా ఎన్నో మందులు వాడాను. అయినా ఫలితం లేదు. నా సమస్యలు శాశ్వతంగా తగ్గే మార్గం చెప్పండి.

శరీరంలో పేరుకుపోయిన వ్యర్థపదార్థాలు శరీరంలో ఎన్నో రుగ్మతలకు కారణంగా ఉంటాయి. వాటిలో ఈ సైనసైటిస్ ఒకటి. ఈ సమస్యకు మౌలికంగా అలర్జీ కారణంగా ఉంటుంది. వాతావరణానికి అతిగా స్పందించే తత్వం వల్ల తరుచూ తుమ్ములు వస్తుంటాయి. శస్త్రచికిత్సల వల్ల తాత్కాలిక ఉపశమనమే తప్ప దాని వల్ల సమస్య పూర్తిగా ఎప్పుడూ పోదు. ఆయుర్వేదంలోని పంచకర్మ చికిత్స ఈ సమస్యకు సరియైన పరిష్కారం. మీకు అర్శమొలల సమస్య కూడా ఉందని రాశారు.

దీనికి రోజంతా కూర్చుని ఉండే ఉద్యోగ, వ్యాపారాలు కారణంగా ఉంటాయి. దీనికి తోడు మలబద్ధకం కూడా కారణం కావచ్చు. మీకు మలబద్ధకం ఉంటే రోజూ రాత్రివేళ పడుకునే ముందు ఒక చెంచా త్రిఫళా చూర్ణం వేసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది అలా మీ అర్శమొలల సమస్య కూడా చాలా వరకు తగ్గుతుంది అప్పటికీ తగ్గకపోతే ఒకసారి ఆయుర్వేద వైద్యుణ్ని సంప్రదించండి. మీ సమస్యలు శాశ్వతంగా దూరమవుతాయి.

చిన్న జ్వరానికే ఇలా అవుతుందా?

ఒక్కోసారి సాధారణ జ్వరం వచ్చిన తరువాత ఏదైనా నరం మీద తొడుగు ఊడిపోయి కాళ్లు, చేతులు చచ్చుబడిపోవచ్చు. కొంతమందికి శరీరంలో పొటాషియం నిల్వలు తగ్గిపోవడం వలన కూడా కాళ్లు చేతులు పని చెయ్యకపోవచ్చు. ఎన్.సి.ఎస్. అనే పరీక్ష ద్వారా నరాలకు జరిగిన నష్టాన్ని తెలుసుకోవచ్చు. ఈ జబ్బు ఉన్న వారిని అత్యవసర విభాగంలో చేర్చి ప్లాస్మాఫెరిసిస్(రక్త మార్పిడి) అనే ప్రక్రియ ద్వారా చికిత్స చేయాల్సి ఉంటుంది.

మా అబ్బాయి వయస్సు 20 సంవత్సరాలు. రెండు వారాల కిందట జ్వరం వచ్చింది. మూడోరోజు నుంచి మా అబ్బాయి కాళ్లూచేతులు పనిచెయ్యడం లేదు. నిన్నటి నుంచి శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారింది. చిన్న జ్వరానికే ఇలా అవడమేమిటి? అసలు మా అబ్బాయికి ఏమైంది? ఈ సమస్యల నుంచి బయటపడేందుకు మీరేదైనా సలహా ఇవ్వగలరా?

మీరు రాసిన లక్షణాలను బట్టి చూస్తే అబ్బాయి గులియన్ బారి సిండ్రోమ్ అనే జబ్బుతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఒక్కోసారి సాధారణ జ్వరం వచ్చిన తరువాత ఏదైనా నరం మీద తొడుగు ఊడిపోయి కాళ్లు, చేతులు చచ్చుబడిపోవచ్చు. కొంతమందికి శరీరంలో పొటాషియం నిల్వలు తగ్గిపోవడం వలన కూడా కాళ్లు చేతులు పని చెయ్యకపోవచ్చు. ఎన్.సి.ఎస్. అనే పరీక్ష ద్వారా నరాలకు జరిగిన నష్టాన్ని తెలుసుకోవచ్చు. ఈ జబ్బు ఉన్న వారిని అత్యవసర విభాగంలో చేర్చి ప్లాస్మాఫెరిసిస్(రక్త మార్పిడి) అనే ప్రక్రియ ద్వారా చికిత్స చేయాల్సి ఉంటుంది. ఖర్చు భరించుకోగలిగితే ఇమ్యునోగ్లోబులిన్ అనే మందు కూడా పేషంట్‌కు ఇప్పించవచ్చు.

అయితే కొంతమంది ఏ మందులూ లేకుండానే కేవలం ఫిజియోథెరపీ ద్వారా మెరుగవుతారు. అయితే మీ అబ్బాయికి ఆయాసం కూడా ఉందని రాశారు కాబట్టి, వెంటనే ఏదైనా పెద్ద ఆసుపత్రిలో చేర్పించి రక్త మార్పిడి (ప్లాస్మాఫెరిసిస్) చికిత్స చేయించండి. దీంతో మీ అబ్బాయి కోలుకునే అవకాశాలు ఉంటాయి.

నా వయస్సు 30 సంవత్సరాలు. నేను ఏ పని చేస్తున్నా చాలా త్వరగా అలసిపోతున్నాను. ఉదయం నిద్ర లేచినప్పుడు హుషారుగానే ఉంటుంది. సమయం గడిచేకొద్దీ నాలో శక్తి తగ్గిపోతున్నట్లు అనిపిస్తోంది. ఈ మధ్య మింగడానికి కూడా కష్టమవుతోంది. అంతేకాదు నా కనురెప్పలు మూసుకుపోతున్నాయి. దయచేసి నా సమస్యలకు తగిన పరిష్కారం సూచించగలరు.

మీరు మయస్థీనియా గ్రేవిస్ అనే జబ్బుతో బాధపడుతున్నారు. ఇది ముఖ్యంగా మహిళలో ఎక్కువగా వస్తుంది. ఈ జబ్బు ఉన్న వారిలో అఛిజి అనే రసాయనం తక్కువ కావడం వల్ల కండరాలు చాలా త్వరగా అలసిపోతాయి. దీంతో కాస్త చిన్న పనికే అలసట కలుగుతుంది. 90 శాతం మందిలో ఈ జబ్బు.. కనురెప్పలు వాలిపోవడం, సరిగా నమలలేకపోవడం, మెడ స్థిరంగా నిలపలేకపోవడం వంటి లక్షణాలతో మొదలవుతుంది. జబ్బు ముదిరేకొద్దీ కాళ్లూ చేతులు కూడా బలహీనపడతాయి. కొంతమందిలో ఊపిరితీసుకునే కండరాలు కూడా అలసిపోవడం వల్ల శ్వాసకు కూడా ఇబ్బంది ఏర్పడవచ్చు. ఈ జబ్బును ఆర్.ఎన్.ఎస్ అనే పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు.

నియోస్టిగ్మిన్ అనే ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా కూడా ఈ జబ్బును నిర్ధారించవచ్చు. మెస్టినాన్ అనే మాత్రలు వేసుకోవడం ద్వారా అలసట పూర్తిగా నయం అవుతుంది. స్టెరాయిడ్ టాబ్లెట్లు అజాథయోప్రిన్ అనే మాత్రలు వాడడం ద్వారా వ్యాధి ముదరకుండా అదుపులో ఉంచుకోవచ్చు. ఈ వ్యాధి తీవ్రంగా ఉన్న వారిలో ప్లాస్మాఫెరిసిస్, ఇమ్యునోగ్లోబులిన్ ద్వారా కూడా జబ్బును తగ్గించవచ్చు. మధ్య వయసులో ఉన్న వారికి శస్త్రచికిత్స చేసి థెమస్ గ్రంథిని తొలగించడం ద్వారా కూడా ఈ జబ్బు ముదరకుండా చూడొచ్చు. కాబట్టి మీరు ఆలస్యం చేయకుండా మీకు దగ్గరలో ఉన్న మంచి న్యూరాలజిస్ట్‌ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి. మీ సమస్యలన్నీ తప్పక పరిష్కారం అవుతాయి.

నా వయస్సు 26 సంవత్సరాలు. రెండు నెలల నుంచి నా కుడి చేయి పట్టు తగ్గిపోతోంది. చేయి కూడా సన్నబడుతోంది. రోజురోజుకీ ఈ ఇబ్బంది అధికమవుతోంది. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం సూచించగల రా?

చేతిలో బలం తగ్గడానికి చాలా కారణాలు ఉంటాయి. నరాల జబ్బు వలన చేయి సన్నగా అవొచ్చు. లేదంటే మెడ వెన్నుపూసలో తేడా ఉన్నా కూడా చేతులు సన్నబడవచ్చు. ఎన్.సి.ఎస్ అనే పరీక్ష చేయించుకోవడం ద్వారా నరాలు ఎక్కడ దెబ్బ తిన్నాయో తెలుస్తుంది. కుష్ఠువ్యాధి, వ్యాస్కులైటిస్, డయాబెటిస్ వంటి జబ్బు ఉన్నా కూడా చేయి సన్నబడటానికి అవకాశం ఉంటుంది. కొంతమందిలో కుష్ఠు వ్యాధి చర్మంతో సంబంధం లేకుండా నరాలకు రావచ్చు.

దీనిని నర్వ్ బయాప్సీ పరీక్ష ద్వారా నిర్ధారణ చేసుకోవలసి ఉంటుంది. ఈ జబ్బు ఉన్న వారు రెండు సంవత్సరాలు మందులు వాడాల్సి ఉంటుంది. మిగిలిన కొన్ని రకాల జబ్బులను స్టెరాయిడ్ మందులతో తగ్గించవచ్చు. కొంతమందికి వెన్నుపూసలోని నరాల కణాలు తగ్గిపోవడం వల్ల కూడా చేతులు సన్నబడే అవకాశం ఉంటుంది. దీనికి మందులతోపాటు ఫిజియోథెరపీ చేయాల్సి వస్తుంది.

మీ విషయంలో వ్యాధి ఏమిటో తెలియడానికి ముందు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. తరువాత వ్యాధిని బట్టి తగిన చికిత్స తీసుకోవలసి ఉంటుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా మీకు దగ్గరలో ఉన్న మంచి న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి.. మీ సమస్య పరిష్కారం అవుతుంది

అల్సర్ మందులతో కిడ్నీలకు ప్రమాదమా?

నా వయస్సు 68 సంవత్సరాలు. నాకు డయాబెటిస్ ఉంది. కిడ్నీల పనితీరు సరిగ్గాలేదు. గత ఆరునెలలుగా క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటున్నాను. ఇటీవల కడుపులో నొప్పి, వాంతులు అవుతుంటే ఎండోస్కోపీ చేయించుకున్నాను. గ్యాస్ట్రైటిస్ ఉంది అని చెప్పారు. నేను ఈ వ్యాధి తగ్గడానికి మందులు వాడవచ్చా? అల్సర్ మందుల వల్ల కిడ్నీలు ఇంకా దెబ్బతినే ప్రమాదం ఉందా?

మీరు డయాబెటిక్ నెఫ్రోపతీ, గ్యాస్ట్రైటిస్ సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం మీరు రెగ్యులర్‌గా డయాలసిస్ చేయించుకోవాల్సిన దశలో ఉన్నారు. అంటే మూత్రపిండాల పనితీరు పూర్తిగా చెడిపోయి ఉండవచ్చు. ఇక మీకు కడుపులో నొప్పి గ్యాస్ట్రైటిస్ వల్ల వస్తోంది. ఇది తగ్గాలంటే మందులు వాడాల్సిందే. మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న అల్సర్ మాత్రలు చాలా సురక్షితమైనవి.

వీటిని ప్రోటాన్ పంప్ ఇన్‌హిబిటర్స్ అంటారు. ఈ మాత్రలను కిడ్నీలు ఫెయిల్యూర్ అయిన పేషంట్లకు కూడా ఇవ్వవచ్చు. వీటివల్ల కిడ్నీలు ఇంకా దెబ్బతినే అవకాశం లేదు. కాబట్టి ఏ మాత్రం ఆందోళన చెందకుండా డాక్టర్ సూచించిన మందులను వాడండి.

నా వయస్సు 60 సంవత్సరాలు. 20 ఏళ్ల క్రితం నాకు అల్సర్‌కు ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం అన్నం తిన్న తరువాత కడుపులో నొప్పి వస్తోంది. అప్పుడప్పుడు వాంతులు అవుతున్నాయి. ఎందుకిలా అవుతుందో అర్థం కావడం లేదు? అల్సర్ మళ్లీ తిరగబెట్టిందా?

మీరు రాసిన లక్షణాలను బట్టి చూస్తే మీకు మళ్లీ కడుపులో అల్సర్ తయారయినట్లుగా కనిపిస్తోంది. అల్సర్ ఆపరేషన్ ఇది వరకే చేయించుకున్నారని అంటున్నారు. బహుశా మీకు వాగేటమీ, గ్యాస్ట్రోజెజునాస్టమీ అనే ఆపరేషన్ చేసి ఉంటారు. ఇప్పుడు నొప్పి రావడానికి గ్యాస్ట్రైటిస్ గానీ, మళ్లీ అల్సర్ డెవలప్ కావడం గానీ కారణమై ఉంటుంది.

బైల్ రిప్లెక్స్ వల్ల కూడా కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఒక్కోసారి ఆపరేషన్ చేసిన ప్రదేశంలో దారి మూసుకుపోయే అవకాశం కూడా ఉంది. ఏ కారణం వల్ల కడుపు నొప్పి వస్తుందో తెలియాలంటే ఎండోస్కోపీ చేయించుకోవడం ఒక్కటే మార్గం. కాబట్టి మీరు దగ్గరలోని గ్యాస్ట్రోఎంటరాలజిస్టును కలిసి తగిన పరీక్షలు చేయించుకోండి. మీ సమస్యకు తప్పక పరిష్కారం లభిస్తుంది.

నా వయస్సు 30 సంవత్సరాలు. నాకు బొడ్డులో చిన్న సైజులో ఉబ్బినట్లుగా ఉంటుంది. డాక్టర్‌కు చూపించుకుంటే హెర్నియా ఉందని చెప్పారు. ఇది మందులతో తగ్గే అవకాశం ఉందా? దీనివల్ల భవిష్యత్తులో ఏమైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉందా?

మీరు రాసిన లక్షణాలను బట్టి చూస్తే మీరు అంబిలైకల్ హెర్నియాతో బాధపడుతున్నారని తెలుస్తోంది. మీకు ప్రస్తుతం నొప్పి, వాంతులు లేనట్లయితే భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా చిన్న సైజులో ఉందని వ్రాశారు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ఒకవేళ హెర్నియా ప్రాంతంలో ఇన్‌ఫెక్షన్ గానీ, హెర్నియా బయటకు ఉబ్బి లోనికి పోకుండా ఉండిపోవడం, విపరీతమైన నొప్పి ఉంటే వెంటనే చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మందులతో తగ్గిపోయే వ్యాధి కాదు. కేవలం ఆపరేషన్ ద్వారానే తొలగించడం సాధ్యమవుతుంది. మీకు పైన చెప్పిన లక్షణాలు ఉంటే గనుక ఆపరేషన్ చేయించుకోండి. లక్షణాలు లేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

డిస్క్ ప్రొలాప్స్‌కు చికిత్స ఉందా?

నా వయస్సు 66 సంవత్సరాలు. పదేళ్ల క్రితం డిస్క్ ప్రొలాప్స్ సమస్యతో మీ దగ్గరకి వచ్చాను. మీ దగ్గర తీసుకున్న చికిత్సతో నా సమస్య పూర్తిగా తగ్గిపోయింది. ఇటీవల మా స్నేహితుడు కూడా ఇదే సమస్యతో బాధపడుతూ నొప్పి తట్టుకోలేక సర్జరీ చేయించుకున్నాడు. అయితే సర్జరీ తరువాత కూడా నొప్పి, స్టిఫ్‌నెస్ అలానే ఉంది. ఏ మాత్రం తేడా లేదు. నొప్పిని భరించలేకపోతున్నాడు. మీరందించే చికిత్స గురించి చెప్పడంతో మీ దగ్గరకు రావడానికి సంసిద్ధత వ్యక్తం చేశాడు. అయితే వాడికొక సందేహం. ఏంటంటే...సర్జరీ తరువాత డిస్క్ సమస్యలకు చికిత్స అందించడం సాధ్యమవుతుందా? నొప్పి తగ్గిపోతుందా?

డిస్క్ ప్రొలాప్స్ సమస్య గురించి పూర్తి అవగాహన సర్జరీ చేయించుకున్న తరువాత గానీ రావటం లేదు. ఈ సమస్యకి ఆయుర్వేదంలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. మీరు చికిత్స తీసుకుని మంచి ఫలితం కూడా పొందారు. ఇక ఈ సమస్య లోతుపాతుల్లోకి వెళితే వెన్నుపూసలో కార్టిలేజ్ అనే మెత్తటి పదార్థం ఉంటుంది. దీనిని డిస్క్ అంటారు. డిస్క్‌కు వర్టిబ్రాకు మధ్య ఉండేదానిని ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్ అంటారు. వెన్నెముకకు ఇది కుషన్ లా పనిచేస్తుంది. ఈ డిస్క్ పక్కకు జరిగినపుడు నొప్పి కలుగుతుంది. దీనిని డిస్క్ ప్రొలాప్స్ అంటారు.

టూ వీలర్స్ ఎక్కువగా నడిపే వారిలో, కూర్చునే భంగిమ సరిగ్గా ఉండని వారిలో, ఎక్కువ బరువులు ఎత్తే వారిలో, స్థూలకాయంతో బాధపడుతున్న వారిలో ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విపరీతమైన వెన్నునొప్పి, ముందుకు వంగ లేకపోవడం, నడవటానికి కూడా వీల్లేనంత నొప్పి వస్తుండటం, వాపు రావడం లక్షణాలుగా ఉంటాయి. ఆయుర్వేదంలో ఈ రకమైన వెన్నునొప్పికి మంచి చికిత్స అందుబాటులో ఉంది. వెన్నునొప్పితో బాధపడే వారు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది.

దీనివల్ల వెన్నెముక సర్దుకుంటుంది. పక్కకు జరిగిన డిస్క్‌ను తిరిగి పూర్వస్థానంలో చేర్చడానికి, రక్తనాళాల మార్గాన్ని సాఫీగా మార్చడానికి, కండరాలు బలోపేతం అవ్వడానికి బెడ్ రెస్ట్ ఉపకరిస్తుంది. దీనితోపాటు నూనెలు, హెర్బల్స్ ఉపయోగించి మర్దన చేయడం ద్వారా నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. వ్యాధి తీవ్రతను బట్టి వారం రోజులు గానీ, పదిరోజులు గానీ చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మీ సందేహం విషయానికొస్తే సర్జరీ అయిన తరువాత కూడా ఆయుర్వేద చికిత్స తీసుకోవచ్చు. కాబట్టి మీరు ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి. మీ సమస్య తప్పకుండా తగ్గిపోతుంది.

నా వయస్సు 29 సంవత్సరాలు. నేను పైల్స్‌తో బాధపడుతున్నాను. మలవిసర్జన సమయంలో రక్తం పడుతోంది. నాకు ప్రస్తుతం ఆరు నెలల పాప ఉంది. డెలివరీ తరువాతే ఈ సమస్య మొదలయింది. పైల్స్‌కు ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది. పైల్స్ బాధించకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

నీరు ఎక్కువగా తాగకపోవడం, పీచుపదార్థాలు తీసుకోకపోవడం, పళ్లు, ఆకుకూరలు తక్కువగా తినడం వల్ల మలబద్దకం సమస్య తలెత్తుతుంది. మలబద్దకం దీర్ఘకాలం కొనసాగితే అది పైల్స్‌కు దారితీస్తుంది. పైల్స్ ఉన్నవారిలో మలవిసర్జన సమయంలో రక్తం పడటం సాధారణ లక్షణం. ఇక ఈ సమస్యను ఆయుర్వేద మందుల ద్వారా పూర్తిగా తగ్గించవచ్చు. చికిత్సతో పాటు రోజూ వారి జీవన విధానంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సమస్య త్వరగా తగ్గిపోతుంది.

కాబట్టి మీరు ముందుగా జీవన విధానాన్ని మార్చుకోండి. సమయానుకూలంగా భోజనం చేయడం, ఫ్రూట్స్ తినడం చేయండి. వ్యాయామం చేయడం కూడా అవసరమే. నీరు ఎక్కువగా తాగండి. ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. మలబద్దకం లేకుండా చూసుకుంటే చాలు. మీ సమస్య సగం తగ్గినట్టేనని గుర్తుపెట్టుకోండి. ఈ జాగ్రత్తలు పాటిస్తూ ఆయుర్వేద చికిత్స తీసుకుంటే వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది.

నా వయస్సు 42 సంవత్సరాలు. గత ఏడాదిగా నడుం నొప్పితో బాధపడుతున్నాను. ఇటీవల నొప్పి నడుము నుంచి కాళ్లకు కూడా వ్యాపిస్తోంది. కాళ్లు తిమ్మిర్లు వస్తున్నాయి. బరువుగా అనిపిస్తున్నాయి. నడుము నుంచి కాలి బొటన వేలి వరకు నొప్పి ఉంటోంది. నా సమస్య ఏమై ఉంటుంది. దీనికి పరిష్కారం ఉందా?

మీరు 'సయాటికా'తో బాధపడుతున్నారు. సయాటికా అనేది శరీరంలో పొడవైన నరం. వెన్ను దగ్గర ప్రారంభమై కాలు వేలు వరకు విస్తరించి ఉంటుంది. వెన్ను భాగంలో ఈ నరంపై ఒత్తిడి పడినపుడు తీవ్రమైన నొప్పి మొదలవుతుంది. కండరాలు పట్టేయడం జరుగుతుంది. నొప్పి వెన్ను నుంచి ప్రారంభమై కాలు వరకు విస్తరిస్తుంది. నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు నడవటానికి కూడా వీలుపడదు. కూర్చున్నా, నిలుచుని ఉన్నా ఈ నొప్పి రావచ్చు.

ఒక్కోసారి నిద్రలో కూడా మొదలవుతుంది. ఎక్కువ సేపు కూర్చుని లేచినపుడు సయాటికా నరం ఒత్తిడికి గురయి నొప్పి ప్రారంభమవుతుంది. ఈ సమస్యకు ఆయుర్వేదంలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఆయుర్వేద చికిత్సలో భాగంగా తైలాలతో మర్దన చేయడం జరుగుతుంది. దీనివల్ల కండరాలు బలపడి నడుం నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ చికిత్సను కనీసం 14 రోజుల పాటు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మంచి ఫలితం లభిస్తుంది.

వెన్నునొప్పికి తోడు ఇదేమిటీ?

నా వయసు 45. గత రెండేళ్లుగా వెన్ను, కాలు నొప్పితో బాధపడుతున్నాను. ఆర్ధోపెడిక్ డాక్టర్‌తో సంప్రదిస్తే ఇది సయాటికా సమస్య అని చెప్పారు. కొన్ని మందులు రాసి ప్రస్తుతానికి ఈ మందులు వాడండి.ఒకవేళ వీటితో తగ్గకపోతే శస్త్ర చికిత్స గురించి ప్లాన్ చేద్దాం అంటున్నారు. నాకేమో శస్త్రచికిత్స అంటే చాలా భయం. ఒకపక్క ఈ సమస్యతో సతమతమవుతూ ఉంటే ఈ మధ్యే నాకు మరో సమస్య మొదలయ్యింది. కొంతకాలంగా నా లైంగిక శక్తి తగ్గిపోతోంది. చాలా సార్లు స్తంభనలే రావడం లేదు. ఏకకాలంలో వచ్చిపడిన ఈరెండు సమస్యలతో నేను మానసికంగా కుంగిపోతున్నాను. వయాగ్రా వంటి మాత్రలు కూడా వాడాను కానీ, వాటివల్ల తాత్కాలిక ఉపశాంతి తప్ప స్థిరమైన ప్రయోజనమేదీ కనిపించడం లేదు.ఏంచేయాలో నాకేమీ బోధపడటం లేదు. ఇప్పటికే నా వయసు అయిపోయిందని భావించాలా ? నా సమస్యకు ఏదైనా పరిష్కారం ఉంటే సూచించండి.

మీకున్న సమస్యలు రెండూ వేరువేరని మీరు అనుకుంటున్నారు. వాస్తవానికి ఈ రెండిటికీ సయాటికా సమస్యే కారణం. వెన్నుభాగంలోని ఎల్-4, ఎల్-5 డిస్కుల్లో ఏదో ఒక టి గానీ, రెండూ గానీ పక్కకు జరిగినప్పుడు అవి సయాటిక్ నరాన్ని నొక్కుతాయి. ఇది కాళ్లోని వివిధ భాగాల్లో నొప్పి కలిగించడమే కాకుండా కొందరిలో జననాంగం వైపు వెళ్లే రక్త ప్రసారంలో కూడా ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా అంగస్తంభనలు తగ్గిపోవడం గానీ, ఒక్కోసారి పూర్తిగా కోల్పోవడం గానీ, జరగవవచ్చు. కొందరిలో స్తంభనల మధ్య వ్యవధి బాగా పెరిగిపోవ చ్చు. మరికొందరిలో ఈ కారణంగా శీఘ్రస్కలన సమస్య కూడా తలెత్తవచ్చు.

అయితే నరాన్ని నొక్కుతున్న డిస్కును మళ్లీ పూర్వస్థితికి తీసుకు వస్తే మీకున్న రెండు సమస్యలూ ఏకకాలంలో తగ్గిపోతాయి. దీనికి శస్త్ర చికిత్స అవసరం ఎంతమాత్రం లేదు. డిస్కు తన స్థానంలో స్థిరపడటానికి ఆయుర్వేదంలోని మేరు చికిత్సతో పాటు కొన్ని ఔషధాలు అవసరమవుతాయి. అదే సమయంలో కొన్ని రసాయన చికిత్స, వాజీకరణ చికిత్సలు కూడా చేస్తే మీకున్న లైంగిక సమస్యలన్నీ తొలగిపోతాయి. మందులతో శరీరంలో వచ్చే వృద్ధిని బట్టి చికిత్సాకాలం ఆధారపడి ఉంటుంది. లైంగిక శక్తిని వృద్ధిపరిచే వాజీకరణ చికిత్సతో 60 ఏళ్లు వయసులోనూ ఎంతో ప్రయోజనం ఉంటుంది. మీకింకా 45 ఏళ్లే కదా! మీరేమీ ఆందోళన చెందకుండా వెంటనే ఆయుర్వేద వైద్య చికిత్సలకు సిద్ధం కండి.

నా వయసు 24. డ్యాన్సర్ కావాలన్న లక్ష్యంతో గత మూడేళ్లుగా భరత నాట్యం నేర్చుకుంటున్నాను. అయితే ఏడు మాసాల క్రితం డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కింద పడిపోయాను. అప్పటి నుంచి నాకు వెన్ను భాగంలో నొప్పి మొదలయ్యింది. దీనికితోడు తొంటి, తొడలు, మోకాళ్లు, పిక్కలు, పాదాల్లో నొప్పి, తిమ్మిర్లు, మొద్దుబారిపోవడం వంటి సమస్యలు తలెత్తాయి.స్థానిక డాక్టర్ సలహా మేర కు ఫిజియోథెరపీ చేయించుకుంటూ మందులు వాడుతున్నాను. నొప్పి ఎక్కువైన ప్రతి సారీ పెయిన్ కిల్లర్లు కూడా వేసుకుంటూ వస్తున్నాను. ఇవన్నీ చేసినా తాత్కాలికంగా ఉపశమనం ఉంటోందే తప్ప సమస్యలు పూర్తిగా పోవడం లేదు. పైగా పెయిన్ కిల్లర్స్ కారణంగా నాకు ఇప్పుడు అల్సర్లు మొదలయ్యాయి. కడుపు ఉబ్బరం, మంట కూడా వచ్చాయి. అడుగులు ఎడంగా పడుతూ నడకలో కూడా ఎంతో తేడా వచ్చింది. ఈ విషయమై డాక్టర్‌తో మాట్లాడితే శస్త్ర చికిత్స తప్పకపోవచ్చు అంటున్నారు. నా సమస్య మందులతో తగ్గే మార్గమే లేదా ? ఉంటే తెలియచేయండి.

ఏదైనా ప్రమాదంలో గానీ, శక్తికి మించిన బరువు ఎత్తినప్పుడు గానీ, పనిచేసే భంగిమలోని లోపాల కారణంగా గానీ, కొందరి వెన్నుపూసల మధ్య ఉండే డిస్కులు పక్కకు జరుగుతాయి. అలా జరిగిన డిస్కు ఆ పక్కనే ఉన్న సయాటికా నరాన్ని నొక్కుతుంది. అదే నొప్పికి కారణమవుతుంది. సమస్యను ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేస్తే అడుగులు ఎడంగా పడతాయి. ఇది గద్దనడకలా ఉండటం వల్ల ఈ వ్యాధికి గృధ్రసీ వాతం అన్న పేరు స్థిరపడింది. కొన్నాళ్లు పోతే గద్దముక్కుతో పొడిచినట్లు నరం పొడవునా పోట్లు, మంటలూ వస్తాయి. అయితే పక్కకు జరిగిన డిస్కును తిరిగి పూర్వస్థితికి తీసుకు రావడానికి శస్త్రచికిత్స అవసరమేమీ ఉండదు. కేవలం ఆయుర్వేద చికిత్సలతోనే డిస్కులను తమ సహజ స్థానంలోకి తీసుకు రావడం సాధ్యమవుతుంది. ఈ చికిత్స నాలుగు దశలుగా ఉంటుంది.

మొదటిది శరీరం ఉపరి భాగం నుంచి అంటే తైల మర్థనాలతో చేసే మేరు చికిత్స. ఇది పంచకర్మ చికిత్సలో భాగంగా ఉంటుంది. ఆ తరువాత కడుపులోకి కొన్ని మందులు ఇచ్చే అంతర చికిత్స ఉంటుంది. గృధ్రసీ వాత నివారణలో ఈ మందులు బాగా పనిచేస్తాయి. వీటితో పాటే కొన్ని ప్రత్యేక ఆసనాలు, వ్యాయామాలు కూడా అవసరమవుతాయి.ఆహారపు అలవాట్లు, జీవన శైలిలోనూ కొన్ని మార్పులు చేసుకుంటే ఈ సమస్యను పూర్తిగా నిర్మూలించవచ్చు. ఆయుర్వేద చికిత్సలో డిస్కులు పూర్వ స్థానంలోకి రావడమే కాకుండా డిస్కులు, వెన్నుపూసలు, వెన్నుపాము బలపడతాయి. ఫలితంగా సమస్య శాశ్వతంగానే తొలగిపోతుంది. తైల చికిత్సలకు మూడు నుంచి ఆరు వారాల దాకా పడుతుంది. సమస్య తీవ్రతను అనుసరించి కడుపులోకి తీసుకునే మందులు మూడు నుంచి ఆరు మాసాల పాటు వాడితే సరిపోతుంది.

ఆధారము: హెల్త్ కేర్ తెలుగు బ్లాగ్

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate